
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy). ‘ముద్దమందారం’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఈ సీరియల్ ఫేమ్ తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన ఆట తీరులో మెప్పించి, రన్నరప్ గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఆమె చేసిన ఒక భావోద్వేగ సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ ఆ సంగతేంటీ?
తనూజ పుట్టస్వామి బిగ్ బాస్ హౌస్లో ఆమె ప్రవర్తన, ఆట తీరుతో ప్రత్యేక గుర్తింపు పొందింది. తన మెచ్చ్యూరిటీతో వ్యవహరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీజన్ ప్రారంభం నుంచే ఆమెను విజేతగా చూడాలని అభిమానులు కోరుకున్నారు. చివరకు ఆమె రన్నరప్గా నిలిచింది. అయినా, భారీ ఫ్యాన్ బేస్ను సంపాదించుకుంది. బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ పెరిగింది. అదే సమయంలో విమర్శలు కూడా ఎదురయ్యాయి.
ఇటీవల తిరుమలలో తన పుట్టినరోజు జరుపుకున్న ఘటనపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి.ఈ సమయంలో తనూజకు మద్దతుగా సహ బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి సపోర్టుగా నిలిచారు. తనూజను తప్పుబట్టొద్దని, ఏదైనా ఉంటే తనను విమర్శించాలంటూ ట్రోలర్స్కు మాధురి గట్టి హెచ్చరిక ఇచ్చింది.
ఇదిలా ఉండగా తాజాగా తనూజ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక భావోద్వేగ నోట్ షేర్ చేసింది. తనను ఎంతగానో అభిమానించే ఓ మహిళ తన కోసం ప్రత్యేకంగా ఒక డైరీ రాసిందని తెలిపింది. ‘నేను ఎంత అదృష్టవంతురాలినో కదా. నాకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. కానీ ఈసారి నేను చదువుతున్నది ఎంతో ప్రత్యేకమైన పుస్తకం. నా యోగక్షేమాలు కోరుకునే వ్యక్తి నాకోసం రాసిన డైరీ ఇది. దాన్ని చదువుతుంటే నాకు మాటలు రావడం లేదు’ అని తనూజ పేర్కొంది. ఆ డైరీ చదువుతున్నప్పుడు తాను భావోద్వేగానికి లోనై కన్నీళ్లు ఆపుకోలేకపోయానని కూడా చెప్పింది.
‘నమ్ముతారో లేదో… ఇది చదువుతూ ఉంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మనల్ని పూర్తిగా అర్థం చేసుకునేది సాధారణంగా మన కుటుంబసభ్యులే. కానీ, నా విషయంలో ఎంతో మంది నన్ను అర్థం చేసుకున్నారు, అక్కున చేర్చుకున్నారు, నా మంచి కోసం ప్రార్థిస్తున్నారు. నా జీవితానికి ఇది చాలు’ అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. తన కోసం ప్రత్యేకంగా డైరీ రాసిన వందన అనే అభిమానురాలికి తనూజ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఆమెకు ‘ఐ లవ్ యూ’ అంటూ ప్రేమగా సందేశం పంపింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు కూడా స్పందిస్తూ తనూజకు మరింత మద్దతు ఇస్తున్నారు.
ప్రస్తుతం తనూజ టెలివిజన్తో పాటు ఇతర ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ‘ముద్దమందారం’ తర్వాత మరో సీరియల్ చేయని ఆమె ఇప్పుడు ‘అగ్నిపరీక్ష’ సీరియల్లో నటిస్తోంది. అదేవిధంగా వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నట్లు సమాచారం.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/television/bigg-boss-fame-thanuja-puttaswamy-gets-emotional-after-fan-writes-a-special-diary-for-her-167833.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
