
ప్రపంచమంతా జేజేలు పలికే భారతీయ వైవాహిక వ్యవస్థకు క్రమంగా బీటలు వారుతున్నాయి. పెళ్లి విషయంలో యువత ఆలోచనలు క్రమంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు… వయసుకు రాగానే పెళ్లి ప్రస్తావనను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. జీవితంలో ఎదగాలని, తామ లక్ష్యాలకు పెళ్లి అడ్డుగా మారుతోందని అంటున్నారు. అలాగే తెలియని వ్యక్తితో తాము జీవితాన్ని పంచుకోలేమని, దీని కంటే ఒక మనిషితో కొన్నాళ్లు ట్రావెల్ చేసి, ఒకరినొకరం అర్ధం చేసుకుని పెళ్లి చేసుకుంటామని చెబుతున్నారు. ఒకవేళ ఆ వ్యక్తి నచ్చకపోతే.. మరొకరితో రిలేషన్ని ఎంచుకుంటామని ధైర్యంగా చెబుతున్నారు. తాజాగా ఇదే విషయంపై కుండబద్ధలు కొట్టారు స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ.
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చిత్ర పరిశ్రమలో పలువురు నటీనటులు చెప్పేమాట. చాలామంది జీవిత లక్ష్యం డాక్టర్ కావడమే, కానీ డెస్టినీ మాత్రం వారిని నటన వైపు మళ్లిస్తుంది. ఇక కొందరుంటారు. డాక్టర్ అయిన తర్వాత వీరు యాక్టర్స్గా మారుతుంటారు. డాక్టర్ రాజశేఖర్, సాయిపల్లవి, శ్రీలీల తదితరులు మెడిసిన్ చదివి ఆ తర్వాత నటనా రంగం వైపు అడుగులు వేశారు. ఈ కోవలోకే వస్తారు ఐశ్వర్య లక్ష్మీ. డాక్టర్ చదివిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో అడుగుపెట్టారు.
సెప్టెంబర్ 6, 1991న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు ఐశ్వర్య లక్ష్మీ. స్థానికంగా ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఎర్నాకులంలోని శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి 2017లో ఎంబీబీఎస్ పట్టా పొందారు. అయితే అప్పటికే మోడలింగ్లో ఉంటూ పలు టాప్ బ్రాండ్స్కు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో నటించారు ఐశ్వర్య లక్ష్మీ. తొలి నుంచి ఈమెకు నటన పట్ల ఆసక్తి లేదు. అయితే 2017లో అత్లాఫ్ సలీమ్ ఈమె ఇచ్చిన ఆడిషన్స్కి ఫిదా అయిపోయి నవిన్ పౌలే సరసన నటించే అవకాశం కల్పించారు. ఈ సినిమాతో ఐశ్వర్యకు మంచి గుర్తింపుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో అవకాశాలు వెల్లువెత్తి స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు.
సత్యదేవ్ హీరోగా వచ్చిన గాడ్సే మూవీ ద్వారా తెలుగు వారిని పలకరించారు ఐశ్వర్య లక్ష్మీ. ప్రస్తుతం సాయిథరమ్ తేజ్ సరసన సంబరాల ఏటి గట్టు మూవీలో ఆమె నటిస్తున్నారు. తమిళంలో గట్టా కుస్తీ 2, మలయాళంలో ఆశా మూవీలో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే ఐశ్వర్య.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఏ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె స్టైల్. 35 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోకపోవడంతో గతంలో అభిమానులు లైవ్ ఛాట్లో ఈమె పెళ్లి గురించి ప్రశ్నించారు.
నేను సింగిల్గా చాలా హ్యాపీగా ఉన్నాను.. నేను సంతోషంగా ఉండటం మీకు ఇష్టం లేదా? నన్ను డబుల్ చేసేందుకు ప్రయత్నించొద్దని ఫ్యాన్స్పై విరుచుకుపడింది ఐశ్వర్య. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పెళ్లిపై గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని తేల్చేసింది. జీవితంలో నేను పెళ్లి చేసుకోను.. ఎంతోమందిని చాలా దగ్గరి నుంచి చూసి ఈ నిర్ణయం తీసుకున్నా. ఒకరిద్దరు తప్పించి చాలామంది రాజీ పడి బతుకుతున్నారు. పెళ్లి కారణంగా కలల్ని చంపుకుని, వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు.
అందరి అమ్మాయిల్లా నాకు కూడా తొలుత పెళ్లిపై చాలా కలలు ఉండేవి. గురువాయూర్ ఆలయంలో ప్రత్యక్షంగా ఎన్నో పెళ్లిళ్లు చూశాను. నాకు కూడా అలాగే గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఓ మ్యాట్రిమోని సైట్లో నా ప్రొఫైల్ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. అది ఫేక్ అని చాలామంది అనుకున్నారు. ఈ మధ్యలోనే పెళ్లిపై నా ఓపీనియన్ మారిపోయింది.. ఇవన్నీ చూసి, ఆలోచించి జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. సంతోషకరమైన జీవితాన్ని గడపటానికి పెళ్లి అనేది తప్పనిసరి కాదు. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే, ఓ తోడు కోసం సహజీవనం బెస్ట్ అని ఐశ్వర్య లక్ష్మీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/heroine/aishwarya-lekshmi-shocking-comments-on-marriage-says-she-chooses-live-in-relationship-over-wedding-168529.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
