
భారత సినీ పరిశ్రమ భవిష్యత్తుపై బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రేమించే దేశంగా భారత్ ప్రపంచంలోనే ముందుంటుందని చెబుతూ… కానీ థియేటర్ మౌలిక వసతుల విషయంలో మాత్రం మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నామని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ప్రపంచంలోనే సినిమాలను అత్యధికంగా నిర్మించే దేశంగా భారత్ నిలుస్తున్నప్పటికీ, మౌలిక సదుపాయాల విషయంలో మాత్రం మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నామని అన్నారు.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. భారత్లో ప్రస్తుతం సుమారు 9 వేల నుంచి 10 వేల స్క్రీన్లు మాత్రమే ఉన్నాయని, అదే సమయంలో చైనాలో మాత్రం 85 వేల నుంచి 90 వేల వరకు స్క్రీన్లు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ భారీ తేడానే భారత సినిమాల మార్కెట్ పూర్తిస్థాయిలో ఎదగకుండా చేస్తున్న ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలో కూడా దాదాపు 35 వేల నుంచి 40 వేల స్క్రీన్లు ఉండగా, జనాభా పరంగా భారత్ ఎంతో పెద్ద దేశమైనప్పటికీ థియేటర్ల సంఖ్యలో మాత్రం చాలా తక్కువగా ఉందని వివరించారు.
ఈ సందర్భంగా ఇటీవల భారీ విజయం సాధించిన మూవీ ‘ధురంధర్’ గురించి ఆమిర్ ఖాన్ ప్రస్తావించారు. ‘ఈ సినిమా సుమారు రూ.1000 కోట్ల వసూళ్లు సాధించింది. కానీ, ఇదే మూవీ 5,000 స్క్రీన్లకు బదులు 15,000 స్క్రీన్లలో రిలీజ్ అయి ఉంటే.. ఎంత పెద్ద రేంజ్కు వెళ్లేదో ఊహించండి’ అంటూ ఆయన కీలక వ్యాఖ్య చేశారు. ఎక్కువ స్క్రీన్లు ఉంటే కేవలం కలెక్షన్లు మాత్రమే కాదు.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు సినిమాలు చేరుతాయని, దాంతో సినిమా కల్చర్ కూడా వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. భారత సినీ పరిశ్రమలో దాగి ఉన్న అపార అవకాశాలపై ఆలోచన రేకెత్తించారు.
ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మించే దేశం భారత్ అయినప్పటికీ, ప్రస్తుతం దేశంలో చాలా జిల్లాల్లో ఒక్క సినిమా హాలు కూడా లేదని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు థియేటర్ అనుభవమే అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ల సంఖ్య విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నామన్న వాస్తవాన్ని ఆమిర్ ఈ సందర్భంగా మరోసారి ఎత్తిచూపారు. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు స్క్రీన్ల కొరత వల్ల చాలామంది ప్రేక్షకులు థియేటర్ అనుభవాన్ని కోల్పోతున్నారని, అదే సమయంలో ఓటీటీ, పైరసీ వైపు ప్రేక్షకులు మళ్లే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.
దక్షిణ భారతదేశంలోనే దేశంలోని సగానికి పైగా స్క్రీన్లు ఉండటంతో, హిందీ సినిమాలకు వాస్తవంగా లభిస్తున్న స్క్రీన్లు కేవలం 5,000 ప్రాంతంలోనే ఉంటున్నాయని చెప్పారు. ఫలితంగా దేశ జనాభాలో కేవలం 2 శాతం మంది మాత్రమే పెద్ద సినిమాలను థియేటర్లలో చూసే పరిస్థితి ఉందని ఆయన అంచనా వేశారు. ఒక సినిమా ఎక్కువ స్క్రీన్లలో విడుదలైతే ఆదాయం మాత్రమే కాదు… ప్రేక్షకుల చేరువ పెరుగుతుంది, కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయి, లోకల్ సినిమాలకూ బలమైన ఊతం లభిస్తుందని ఆయన సూచించారు.
‘స్క్రీన్లు పెరిగితే భారత సినిమాకు కొత్త రెక్కలు వస్తాయి’అన్న ఆమిర్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ… సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ అంశంపై ప్రభుత్వం, నిర్మాతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే. అదే సమయంలో కార్పొరేట్ మల్టీప్లెక్సుల ఆధిపత్యం పెరగడం, టికెట్ ధరలు భారీగా పెరగడం కూడా ప్రేక్షకులను దూరం చేస్తుందనే మరో అభిప్రాయం కూడా ఉంది. ఆమిర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక సినిమా గురించే కాకుండా… భారత సినీ పరిశ్రమ భవిష్యత్ దిశపై కొత్త చర్చకు తెరలేపినట్లుగా కనిపిస్తున్నాయి.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/bollywood/aamir-khan-on-india-cinema-future-15-000-screens-could-triple-box-office-potential-166623.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
